బీఆర్ఎస్ మేనిఫెస్టో ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎర్రబెల్లి

  • అవుతాపురం బీఆర్ఎస్ లోకి చేరికలు

పెద్దవంగర:
బీఆర్ఎస్ మేనిఫెస్టో ను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని ఆ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని పేర్కొన్నారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. వలస నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. యాబై ఏళ్ల పాలన కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని కేసీఆర్ తొమ్మిదేళ్ల లోనే చేసి చూపిన గొప్ప నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెరబోయిన రాజు యాదవ్, కాలోజు నర్సింహా చారి, పగిడిపాల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *