- గిరిజన సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యం
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు
తొర్రూరు:
తండా బిడ్డల గోసను తీర్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని,బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరో మారు ఆశీర్వదించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పాలకుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి,రాష్ట్రమంత్రి దయాకర్ రావుకు మద్దతుగా బుధవారం మండలంలోని వెలికట్ట శివారు పీఎస్ఆర్ పాఠశాల ఆవరణలో తొర్రూరు,రాయపర్తి,పెద్దవంగర మండలాల గిరిజనులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి దయాకర్ రావు, మరో మంత్రి సత్యవతి రాథోడ్ లు పాల్గొన్నారు.
మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ…పాలకుర్తి నియోజకవర్గంలోని
ఒక్కో తండాకు కోట్ల రూపాయలు వెచ్చించి కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి పరచినట్లు తెలిపారు.
గిరిజనుల,ఆదివాసీల ఏండ్ల గోసను సీఎం కేసీఆర్ ఎడబాపితే, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి వారి అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడిందన్నారు.ఎస్టీలలో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు.కాంగ్రెస్ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని, కాంగ్రెస్ ను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నదమ్ముల్లా కలిసి వున్న ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్ కుట్రపన్నుతోందన్నారు.రైతుల నడ్డి విరచడానికి 3 గంటల కరెంటు చాలంటోందని,24 గంటల కరెంటు కావాలా 3 గంటల కరెంటు కావాలో 3 పంటల బీఆర్ఎస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.
పాలకుర్తి మండల కేంద్రంలో లంబాడాల ఆరాధ్య దైవం సేవాలాల్ గుడి నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. చిన్నతనంలో ఆసుపత్రిలో గిరిజన తల్లి పాలు తాగి బతికానని, తనకు గిరిజనుల గుణాలు అబ్బినట్లు తెలిపారు. ప్రజల్ని విభజించి పాలించే కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్ నేతలను మన నియోజకవర్గంలో కాలు పెట్టనివ్వవద్దన్నారు.తరిమి కొట్టి మనల్నిమనం కాపాడుకోవాలన్నారు.మన కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ కు, నాకు అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.కష్టాల్లో సుఖాల్లో మీతో నేను ఉన్నానని, ఎప్పుడూ ముఖం తెలియని వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారని,ఈ ఎన్నికలు అయిపోతే వారు వెళ్ళిపోతారన్నారు.మనమే ఎప్పటికీ ఇక్కడే ఉంటామని అన్నారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ…మా తండాల్లో మా రాజ్యం అన్న గిరిజనుల కోసం 3,146 తండాలు, గూడాలను గ్రామపంచాయతీలుగా మార్చి తండాల్లో పాలనను కొనసాగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గ్రామాలకు దీటుగా తండాలను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్న దయాకర్ రావుకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.అమెరికా నుంచి వచ్చిన వాళ్లు ఎన్నికలు కాగానే అక్కడికి వెళ్లిపోతారని,నిత్యం మీ వెన్నంటి ఉండే మనిషి దయాకర్ రావు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మాజీ జీసీసీ చైర్మన్ గాంధీ నాయక్,గిరిజన నాయకులు ధరావత్ రాజేష్ నాయక్,మునావత్ నరసింహ నాయక్, బానోతు రవీందర్ నాయక్, ధరావత్ బీమా నాయక్, మాలోత్ కాలు నాయక్, స్వామి నాయక్, గుగులోతు రాజు, వసుంధర్, సోమన్న, కౌన్సిలర్లు ధరావత్ సునీత జై సింగ్, గుగులోత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply