తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

తిరుమల : భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఇస్తికఫాల్ తో స్వాగతం పలకగా ప్రధాని ముందుగా ఆలయ ధ్వజ స్థంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ప్రధానికి వేద పండితులు ఆశీర్వచనం పలకగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి వారికి తీర్థ ప్రసాదాలను, స్వామి వారి చిత్ర పటాన్ని, టీటీడీ క్యాలెండర్, డైరీ 2024 పంచగవ్యాలను అందచేశారు. అంతకు మునుపు స్వామి వారి వద్ద ప్రధాని గారిని శేష వస్త్రంతో ఆలయ ప్రధాన అర్చకులు సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని 140 కోట్ల మంది భారతీయులకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి కలగాలని తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థించానని తమ అనుభూతిని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *