మూడు నక్షత్రాల జెండాకు ఓటెయ్యండి
- సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి మామిండ్ల రమేష్ రాజా
పాలకుర్తి:
అణగారిన జనాల గుండె చప్పుడు రమేష్ రాజా అని, మూడు నక్షత్రాల జెండాకు ఓటేసి ఆయనను గెలిపించాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర నాయకులు లోకం భాస్కర్ రావు పిలుపు నిచ్చారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలో ప్రధాన వీధుల గుండా వివిధ షాపుల యజమానులను, స్థానికులను, ఓటర్లను ఆ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా తో కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ… సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పేద ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. సమ సమాజ స్థాపన లక్ష్యంగా ఎర్రజెండా రాజ్యం కోసం ఉన్నతమైన ఆశయం కోసం పనిచేస్తూ కష్టజీవుల కష్టాలను తీర్చే పార్టీగా లిబరేషన్ పార్టీ ముందుకు పోతుందన్నారు. కుల, మత, ధన స్వామ్య రాజకీయాలను ఓడించాలని, ప్రత్యామ్నాయ రాజకీయాలను ఆదరించాలని, పేద ప్రజల కోసం పోరాడుతున్న తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బూర్జువా, భూస్వామ్య, దోపిడి అరాచక పార్టీల పాలనను ప్రజలు తిరస్కరించాలని, నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ కలిగిన ఎర్ర జెండా బిడ్డను అసెంబ్లీకి పంపించాలని ఆయన కోరారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని అన్నారు.ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు అనంతోజు రజిత, నియోజకవర్గ ఇన్చార్జి జీడి సోమయ్య, ప్రజా సంఘాల నాయకుడు నాగరాజు, శోభన్, రాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply