ఓట్ల పండుగకు పల్లెబాట పట్టిన నగరవాసులు

బోసిపోతున్న భాగ్యనగరం

హైదరాబాద్ : తెలంగాణలో పోలింగ్ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగకు భాగ్యనగరవాసులంతా పల్లెబాట పట్టారు. మరోవైపు గురువారం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సెలవులు ప్రకటించాయి. దీంతో నగరవాసులంతా సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు. ప్రయాణికుల రద్దీతో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇంకోవైపు రైల్వే స్టేషన్లు కూడా జనసంద్రంగా మారాయి. రైళ్లు, బస్సులు ప్యాసింజర్స్‌తో ఫుల్‌గా నిండిపోయాయి. ఎలాగైనా సొంతూళ్లకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఓటర్లంతా ఇబ్బందులు పడుతూనే ఊళ్లకు వెళ్లిపోతున్నారు. ఇక సొంత కార్లు ఉన్నవారు కూడా గ్రామాలకు బయల్దేరారు. ఒకేసారి కార్లు అన్ని రోడ్లపైకి రావడంతో నగరంలో ఆయా చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రాత్రికి కొంత మంది, ఉదయాన్నే మరికొంత మంది సొంతూళ్లకు చేరనున్నారు. ఓట్లు వేసేందుకు నగర వాసులు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో భాగ్యనగరం బోసిపోతుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో ఉన్న ఓటర్లకు ర్యాపిడో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాదీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *